Monday, June 17, 2013

మననంతో సిద్ధిని కలిగించేదే మంత్రం.

 24FeafF 


మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అడిగాడట ఒక మూర్ఖశిఖామణి. ముందర మంత్రం అంటే ఏమిటీ? దాని విలువ ఏమిటీ? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాల మీద సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగిఉన్నవాళ్ళెవరూ ఇటువంటి ప్రశ్నలు వేయరు. ‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్ర’ దేనిని మననం చేయటం వల్ల మనం రక్షింపబడతామో అదే మంత్రం అని సూక్ష్మంగా చెప్పారు సర్వజ్ఞులు. మనసులో ఎవరి రూపాన్ని నిలుపుకుని ఏ శబ్ధాన్ని జపించడం ద్వారా పరమా నంద భరితులవుతారో, శక్తి వంతులవుతారో అదే వారిపాలిట అమెఘమైన మంత్రం అవుతుంది. అక్షరం బ్రహ్మ స్వరూపం. అందుక దానికి ‘క్షరం’ అనేది ఉండదు. అది నిత్య నూతనం. క్షరం అంటే నశించునది అని అర్ధం. అక్షరం అంటే నాశము లేనిది.
 
 అందుకే ఋషులు ఈ అక్షరాల్ని ఆధారంగా చేసుకుని వాటిని మంత్రంగా మలచుకుని భగవంతుని అనేక రూపాల్లో సాక్షాత్కరింపచేసుకున్నారు. ముందుతరాలకి కూడా అందించారు. వారు అందించిన ఆ మంత్రాక్షరాలనే మనం బీజాక్షరాలుగా పిలుచుకుంటున్నాం. ఈ బీజాక్షరాలకి అధిదేవతల్ని కూడా మనకి మహానుభావులు అందించారు. ఏ భీజాక్షరాన్ని పటిస్తే ఏదేవత అనుగ్రహం కలుగుతుందో ఆయా గ్రంధాల్లో సంగ్రహంగా వివరించారు. వారు ఆచరించి మనకి మార్గదర్శకులు కావడం మూలంగా ఆయా బీజాక్షరాలకి కూడా దివ్యత్వం చేకూరింది. విశ్వామిత్రుడు 26 బీజాక్షరాల్ని పొందుపరిచి గాయత్రీ మంత్రాన్ని మనకందించాడు.
ఆయన తపఃఫలం చేత ఆవిర్భవించిన ఈ గాయిత్రీ, సకల మంత్రాలకీ మంత్రరాజంగా రూపుదిద్దుకుంది. ‘ఓం భూర్భువర్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మహామంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అవి, ఇవీ అనికాదు సకల శుభాలూ సమకూరతాయని సాక్షాత్‌ విశ్వామిత్రులవారే చెప్పారు. ఆ తరువాత ఎందరో మహానుభావులు ఈ మంత్ర రాజాన్ని ఆధారంగా చేసుకుని, సకల దేవతలకీ ఆ శక్తిని ఆపాదించారు. ఆ కోవలో వచ్చినవే రామగాయిత్రి, కృష్ణ గాయిత్రి, హనుమద్గాయిత్రీ వంటి అనేక దేవతల రూపాలతో మనం గాయిత్రిని కొలుస్తాం. 

మంత్రాలకి చింతకాయలు రాలతాయా! అంటూ అవహేళన చేసేవారు ముందుగా వారికి వారు సాధనచేసి తెలుసు కోవడం ఉత్తమ మార్గం తప్ప, నోటిమాటగా ఇష్టం వచ్చిన రీతిలో ప్రసంగిస్తే, అది మహానుభావుల్ని అవమానపరిచినట్టే అవుతుంది.

Gayatri
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహీ
తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ అంటూ విష్ణుమూర్తిని,
మహాదేవైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌ అంటూ లక్ష్మీదేవినీ
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ
తన్నో రుద్రః ప్రచోదయాత్‌ అంటూ శివుని,
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహీ
తనో దుర్గి ప్రచోదయాత్‌ అంటూ అమ్మవారినీ


ఇలా మన ఇష్టదైవాల్ని ప్రార్ధిస్తూవుంటాం. బీజాక్షరాలు అన్నిటిలోను ఒకే విధంగా అనిపిస్తున్నా మూర్తుల్లో తేడా ఉంది కనుక ఈ మంత్రాల్ని మనం నిత్యపూజా విధానంలో కూడా అనుసంధానిస్తాం. అయితే వీటన్నిటికీ మూలం గాయిత్రీ మంత్రమే. పురాణ యుగం గానీ, చారిత్రక యుగం గానీ పరిశీలించినట్లైతే, శ్రీరామ సేవాతత్పరుడు, అమేయబలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ‘రామ’ అనే రెండక్షరాల మంత్ర జపంతో శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందడమే కాకుండా ఆయనకు అండగా కూడా ఉండి, చిరంజీవిగా నిలిచి పూజలందుకుంటున్నాడు. అదే విధంగా ‘రామ’ అనే బీజాక్షర జపంతో బోయవాడుగా అక్షరం ముక్కరాని ఒక అడవి మనిషి వాల్మీకి అయ్యాడు. శ్రీరామాయణ గ్రంధం రచించి శాశ్వత కీర్తిమంతుడయ్యాడు. ఇదే రామాయణ కాలంలో రాక్షసకృత్యాలు సాగించిన రావణాబ్రహ్మ, ఓంనమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో అమేయ బలసంపన్నుడు, త్రికాలవేదీ, మహామహిమాన్వితుడు అయ్యి రావణాసురుడుగా మారాడు.
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్న విధంగా ఏ మంత్రానై్నా భక్తిశ్రద్ధలతో నిత్యం జపించడం వల్ల దాని ఫలితం తెలియకుండానే మనలో చేరుతూవుంటుంది. అయితే ఎంతో కష్టపడి, సాధనతో ఒక సంస్కారానికి చేరిన తరువాత ఈ మంత్ర ప్రభావం వల్ల మనలో పెంపొందిన శక్తిని ‘చింతకాయ’ల కోసం బుద్ధున్నవాడెవడూ వినియోగించడు. నిజానికి మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలనుకుంటే చింతకాయలే కాదు, ఒక్క మాటతో కొండమీద కోతిని కూడా దింపవచ్చు. ఇందులో సందేహం ఏమీ ఉండదు.

mantram3
ఇక చారిత్రక యుగానికి వస్తే, శివాజీ అమ్మవారిని జపించి ఖడ్గాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసినదే. భక్తరామదాసు రామ నామ జపంతో తరించిన విషయం ఏనాటిదో కాదుగా! ఆయన రామనామ మంత్ర తరంగాల వల్ల తానీషా కూడా ధన్యుడయ్యాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సమకాలీనురాలిగా ఉన్న కుమ్మరి కులంలో పుట్టిన మొల్ల రామ నామంతో పరిపూర్ణ జ్ఞానవంతురాలయ్యి, రామాయణ సత్కథామృతాన్ని మనకందిచిన మాట మనం మరువగలమా! త్యాగయ్య, అన్నమయ్య ఈ యుగం నాటి వారే కదా. కనుక మంత్రానికి తగిన శక్తిని మనం సమకూర్చగలిగితే మంత్రం మనకి ఒక అమూల్యమైన వజ్రాయుధంలా సంరక్షిస్తూవుం టుంది. దేవుడూ లేడు, మంత్రమూ లేదు అనుకునే పిడివాదులు ఈరోజుల్లో చాలామంది ఉన్నారు. అటువంటివారు స్వీయ పరిశోధనచేసి దాని విలువని తెలుసుకోవాలి తప్ప, వాద ప్రతివాదాలతో దాని విలువని కొలవడం మానవ సాధ్యం కాదు.

విశ్వామిత్రుడు 26 బీజాక్షరాల్ని పొందుపరిచి గాయత్రీ మంత్రాన్ని మనకందించాడు. ఆయన తపఃఫలం చేత ఆవిర్భవించిన ఈ గాయిత్రీ, సకల మంత్రాలకీ మంత్రరాజంగా రూపుదిద్దుకుంది. ‘ఓం భూర్భువర్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మహామంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అవి, ఇవీ అనికాదు సకల శుభాలూ సమకూరతాయని సాక్షాత్‌ విశ్వామిత్రులవారే చెప్పారు. ఆ తరువాత ఎందరో మహానుభావులు ఈ మంత్ర రాజాన్ని ఆధారంగా చేసుకుని, సకల దేవతలకీ ఆ శక్తిని ఆపాదించారు.

No comments: