ఇందులోనే శిష్ట రక్షణ కూడా దాగివుంది. ఎలాగంటే, వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు శ్రీహరి పరమ భక్తులు. సప్త ఋషుల వల్ల శాపగ్రస్తులవ్వగా శ్రీహరి తరుణోపాయాన్ని ప్రసాదించాడు. అవి ఏమిటంటే, పరమ భక్తులుగా పుట్టి 7జన్మల తర్వాత తనను కలుసుకోవడం ఒక మార్గం, ఇక రెండవది బద్ధ శత్రువులై శ్రీహరి చేతిలోనే సంహరింపబడి 3 జన్మల్లోనే స్వామి సన్నిధిని చేరుకోవడం. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని శ్రీహరి అడగగా, శ్రీహరిని విడిచి 7జన్మలు గడపటం అసాధ్యంగా భావించిన జయవిజయులు, ‘స్వామీ మేము తమకు బద్ధ విరోధులమై 3జన్మల్లోనే తిరిగి మీ వద్దకు వచ్చేటట్టు వరాన్ని ప్రసాదించు’ అని వేడుకున్నారు. శిష్టులైన వీరికి శాప విమోచనాన్ని కలిగించి రక్షించడం తన కర్తవ్యం.
రాముని జననం వెనుక ఉన్న దేవరహస్యాన్ని ఒక్కసారి పరికిస్తే, భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చూడలేక అన్ని సుఖాల్నీ వదిలి ఆ వైకుంఠవాసుడు మన కోసం అవతారం ధరించాడు. పుట్టడం కూడా రామ అనే పేరుతో పుట్టాడు. రాక్షస మర్ధనం కోసం జన్మించినందున రామా అనే నామంతో పుడుతానని ఆ శ్రీహరి ముందుగానే నిర్ణయించాడు. ఒక సామాన్య మానవునిలా మన మధ్య సం చరిస్తూనే, చక్రవర్తి కుమారునిగా జన్మించి కూడా మాన వాళి కోసం, విశ్వ శ్రేయస్సుకోసం అన్నిటినీ త్యజించి తండ్రి మాట జవదాటకుండా వనవాసానికి వెళ్ళి అన్నిరకాల కష్టా లూ అనుభవించాడు. పుట్టడానికి ముందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న రాముడు లక్ష్యసాధనలో సామాన్య మానవు నిగానే ఉన్నాడు తప్ప దివ్యపురుషుడిగా మహిమాన్వితునిగా ఎక్కడా ప్రకటించుకోలేదు. తన దైవత్వాన్ని ప్రదర్శించలేదు.
ఆ కాలంలోనే శ్రీరాముడు జాతి, కుల వివక్షలేకుండా స్నేహ ధర్మాన్ని పాటించి విశ్వసౌభ్రాతృత్వం కనబరచిన మాన్యుడు శ్రీరామచంద్రుడు. అందుకు ఉదాహరణ, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న గుహుడ్ని ప్రేమతో అక్కున చేర్చుకుని కులం అంటే మనవత్వం అని చాటిచెప్పిన గొప్ప మానవతావాది శ్రీరాముడు. పక్షి జాతి అయిన జటాయువుని పట్ల కృతజ్ఞతా భావంతో అంత్యక్రియలు కూడా చేసి సద్గతుల్ని ప్రసాదించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. వనచర జాతికి చెందిన వానర సమూహంతో స్నేహ బంధాలు ఏర్పరచుకున్న స్నేహశీలి.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే, రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు.
సీతామాతనే తప్ప అన్యకాంతల ముఖాలు కూడా చూడలేదు. శూర్పణఖ వృత్తాంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించిన మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయనకి ఒకే పత్ని. అన్న బాటని అనుసరించారు తమ్ముళ్ళు. తమ్ముల మాటని గౌరవించాడు శ్రీరాముడు. భ్రాతృప్రేమకి ఇదే నిదర్శనం. రామునిలో ఇన్ని కోణాలు దర్శించి రచించిన వాల్మీకి ఆ రామాయణ కావ్యాన్ని మనకందించాడు. రామాయణం అన్ని యుగాలకీ నిత్య పారాయణం.
రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ,
స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది.
No comments:
Post a Comment